Site icon pvginox

100 రోజుల్లో రోడ్ మ్యాప్ …డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్

Spread the love

(09/10/2025,pvginox.com By PALLA VENUGOPAL )

ఓ మత్స్యకారుడిగా ఆలోచించి సమస్యను పరిష్కరిస్తా

నేను ఉప ముఖ్యమంత్రిగానో, ఎమ్మెల్యేగానో ఉప్పాడకు రాలేదు. ఓ మత్స్యకారుడి బాధను అర్థం చేసుకోవడానికి వారి ఇంట్లోని సభ్యుడిగా, వారిలో ఒకడిగా వచ్చాను. నాకు మత్స్యకారులు పడుతున్న వేదన, వేట కోసం పడుతున్న యాతన తెలిసింది అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. పరిశ్రమల ద్వారా సముద్రంలో కలుస్తున్న కలుషిత జలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటే కనీసం 100 రోజుల సమయం కావాలని, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే పరిష్కారాన్ని చూపించే బాధ్యతను తాను తీసుకుంటానని వెల్లడించారు. పిఠాపురం నియోజక వర్గంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిశ్రమల కలుషిత జలాలు నేరుగా సముద్రంలో కలుస్తుండటంతో జరుగుతున్న నష్టాన్ని అరికట్టేందుకు, అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లేందుకు తగిన సమయం కావాలన్నారు. ఉప్పాడ మత్స్యకారులంతా దీనిపై చేతులు పైకి ఎత్తి అభిప్రాయం తెలియజేయాలని బహిరంగ సభలోనే రిఫెరండం కోరారు. పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి గ్రామంతోపాటు చుట్టు పక్కలనున్న గ్రామాల్లో కొన్ని ఫార్మా పరిశ్రమల కాలుష్యం కారణంగా మత్స్య సంపద దెబ్బ తింటోందని, వేట కష్టం అవుతోందని గత కొద్దిరోజులుగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళనల దృష్ట్యా సమస్యను పరిష్కరించేందుకు, మత్స్యకారుల వేదన వినేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులతో మాటామంతీ కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించారు. అనంతరం ఉప్పాడ సెంటర్లో బహిరంగసభలో ప్రసంగించారు. ఈ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘పరిశ్రమలను మత్స్యకారులెవరూ వద్దు అనడం లేదు. పరిశ్రమల వల్ల వస్తున్న కాలుష్యాన్ని మాత్రమే వారు వ్యతిరేకిస్తున్నారు. ఇది మత్స్యకారులకు అభివృద్ధి మీద ఉన్న అవగాహనకు నిదర్శనం. రాష్ట్ర అభివృద్ధిలో పారిశ్రామిక ప్రగతి కీలకం. పరిశ్రమలు వస్తేనే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. దీన్ని మనసుతో అర్ధం చేసుకున్న మత్స్యకారులకు కృతజ్ఞతలు. అయితే మత్స్యసంపదను, వారి జీవనభృతిని దెబ్బతీస్తున్న కాలుష్యాన్ని అరికట్టడంపై ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు తగిన సమయం కావాలి. తీర ప్రాంతంతో పాటు పిఠాపురం చుట్టు పక్కల ప్రాంతాల్లోకి పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం మీద కూడా ఆడిట్ చేయాలని జిల్లా అధికారులను కోరుతున్నాం. దీనిపై ఓ ప్రత్యేకమైన కమిటీ వేసి సమస్యను గుర్తించడమే కాదు.. దాని పరిష్కారాన్ని చూపేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తాం.

మత్స్యకార సమస్యల పరిష్కారానికి 100 రోజుల్లో రోడ్ మ్యాప్

‘మత్స్యకారుల జీవితాలకు భరోసా కల్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తుంది. తూతూ మంత్రం చర్యలు కాకుండా మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తాం. 100 రోజుల్లో మత్స్యకారులు చెప్పిన ప్రతి సమస్యకు ప్రాథమిక పరిష్కార మార్గాలు చూపే విధంగా రోడ్ మ్యాప్ రూపొందిస్తామ’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. తీరంలో కాలుష్య సమస్యకు పరిష్కారం చూపే దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పని చేస్తామని చెప్పారు. అందుకోసం తన అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో నూతన పొల్యూషన్ పాలసీ తీసుకురానున్నట్టు తెలిపారు. అంతకు ముందే సమస్య ఉన్న పరిశ్రమల్లో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించనున్నట్టు చెప్పారు. గురువారం కాకినాడ కలెక్టరేట్ లో మత్స్యకార సోదరులతో మాట… మంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. యు.కొత్తపల్లి మండల పరిధిలోని తీర ప్రాంత గ్రామాల నుంచి వచ్చిన మత్స్యకార ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 15 మంది తమ సమస్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. మత్స్యకారులు చెప్పిన ప్రతి సమస్యను ఓపికగా విని అన్నింటినీ నోట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా వేటకు వెళ్లి మృతి చెందిన మత్స్యకారులకి సంబంధించిన బీమా చెక్కులను రూ.5 లక్షల చొప్పున 18 కుటుంబాలకి విడుదల చేశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “మత్స్యకార సోదరులు పలు సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చారు. అందులో తీర ప్రాంతం కోతకు గురవుతున్న అంశం ముఖ్యమైనది. ఉప్పాడ తీర ప్రాంతం ఏటా సుమారు 25 మీటర్ల మేర కోతకు గురై సాగరంలో కలసిపోతుంది. ఇది ప్రకృతి విపత్తు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భావించాం. జిల్లా కలెక్టర్ గారితోపాటు ఉన్నతాధికారుతో సమస్యపై చర్చించాం. కోత సమస్య నివారణకు రక్షణ గోడ నిర్మాణం అవసరం ఉంది. దానికి రూ. 300 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని సి.ఆర్.జెడ్. చెన్నై అధికారులు తెలిపారు. అయితే తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలో ఉంది. ఉప్పాడ తీరంలో రక్షణ గోడ నిర్మాణం కోసం గౌరవ కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి విన్నవించాము. అక్కడ నుంచి సానుకూల స్పందన వచ్చింది. వచ్చే రెండు, మూడేళ్లలో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం పూర్తి కావాలని కోరుకుంటున్నాం. అందుకోసం అవసరం అయితే మరోసారి ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతా. ఈ గోడ నిర్మాణం పూర్తయితే 50 ఏళ్ల పాటు అది మన తీర ప్రాంతానికి రక్షణ కవచంగా ఉంటుంది. అప్పటి వరకు రూ. 6 కోట్లు ఖర్చు చేసి తాత్కాలిక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రూ. 60 లక్షలు ఖర్చు చేసి మూలపేట వద్ద తాత్కాలిక రక్షణ పనులు ప్రారంభించాం. సీఎస్ఆర్ నిధులు, ప్రభుత్వం నిధులతో సౌకర్యాలు కల్పిస్తున్నాం.

Exit mobile version