Site icon pvginox

2 నెలల్లో యూనిట్లు వంద శాతం గ్రౌండింగ్ చేయండి: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

Spread the love

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా బీసీ సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న పథకాలను సకాలంలో అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని, రాబోయే 2 నెలల కాలంలో బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేసే యూనిట్లు వంద శాతం గ్రౌండింగయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఇటీవల రిటైరయిన బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ స్థానంలో సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో సోమవారం బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు పథకాల అమలు తీరు తెన్నులపై చర్చించారు. రాబోయే రెండు నెలల కాలం ఎంతో విలువైనదని, లబ్ధిదారులకు పథకాలు అందేలా చూడాలని అన్నారు. ముఖ్యంగా వివిధ స్వయం ఉపాధి పథకాల్లో భాగంగా రుణాలు త్వరితగతిన మంజూరు చేయించి, యూనిట్లు గ్రౌండయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటిలోనూ వ్యాపారవేత్తను తయారు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్య సాధనలో భాగంగా కింది స్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుని, స్వయం ఉపాధి కింద యూనిట్లు వంద శాతం గ్రౌండింగయ్యేలా చర్యలు తీసుకోవాలని కార్యదర్శి సత్యనారాయణకు మంత్రి సవిత సూచించారు.

జారీచేసిన వారు : రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యలు వారి కార్యాలయం

Exit mobile version