ఢిల్లీలో బిల్ గేట్స్ తో ఏపి సిఎం చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం
ఆరోగ్య, వ్యవసాయ, విద్య రంగాల్లో టెక్నాలజీ వినియోగంపై గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం
బిల్ గేట్స్ ను రాష్ట్రానికి ఆహ్వానించి ముఖ్యమంత్రి చంద్రబాబు
( న్యూ ఢిల్లీ, pvginox. com )
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం చేసుకుంది. పరిపాలనతో పాటు వివిధ శాఖల్లో టెక్నాలజీ ఆధారిత కార్యక్రమాలను అమలు చేయడానికి అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆరోగ్య సంరక్షణ, మెడ్టెక్, విద్య, వ్యవసాయ రంగాల్లో ఖర్చు తగ్గింపు, ఉపాధి కల్పన వంటి రంగాల్లో విస్తృత స్థాయిలో ప్రయోజనాలు అందించే విధానాలను అభివృద్ధి చేసే అంశాలపై ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాల్లో కొత్త ఆవిష్కరణలను అందించడానికి సంయుక్తంగా పనిచేయనున్నారు. ఆరోగ్య రంగంలో AI ఆధారిత టెక్నాలజీ ద్వారా ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఆటోమేటెడ్ డయాగ్నోస్టిక్స్ విభాగాల్లో గేట్స్ ఫౌడేషన్ సహకారం అందించనుంది. అదే విధంగా వ్యవసాయ రంగంలో AI ఆధారిత కార్యక్రమాలకు, సాగు నిర్వహణలో శాటిలైట్ ఆధారిత వ్యవస్థలను ప్రవేశపెట్టనున్నారు. అదే కొత్త ఆవిష్కరణల ద్వారా ఉపాధి కల్పన అవకాశాలను మెరుగుపరచనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “గేట్స్ ఫౌండేషన్ మద్దతుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. టెక్నాలజీ ఆధారిత పరిపాలన, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో వినూత్న పరిష్కారాలను చూపేందుకు ఈ ఒప్పందం ఎంతో దోహదపడుతుంది” అని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిందిగా బిల్ గేట్స్ ను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఈ ఒప్పందం ద్వారా డేటా ఆధారిత అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న చొరవ, సంకల్పాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మెన్ బిల్ గేట్స్ ప్రశంసించారు. “ఈ ఒప్పందం ద్వారా తక్కువ ధర కు, సులభంగా లభ్యమమ్యే, స్థానికంగా తయారు చేసే వైద్య పరికరాలు, నాణ్యమైన వైద్య సేవలు అందించవచ్చని, తద్వారా ప్రజల జీవితాలను మార్చవచ్చని అన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో AI, టెక్నాలజీ వినియోగం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలవచ్చు ” అని అన్నారు. ఢిల్లీలోని హోటల్ లో జరిగిన ఈ సమావేశంలో గేట్స్ ఫౌడేషన్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఐటీ శాఖ సెక్రటరీ కాటంనేని భాస్కర్ గేట్స్ ఫౌడేషన్ తో ఎంవోయులో పాల్గొన్నారు. సమావేశంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని, శ్రీనివాస వర్మ, ఎంపి శ్రీకృష్ణ దేవరాయులు, సిఎంవో అధికారులు పాల్గొన్నారు.
