‘అడవి తల్లి బాట’కు అంకురార్పణ
- గిరిజన గ్రామాల్లో రెండు రోజులపాటు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన
గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ‘అడవి తల్లి బాట’ పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో అడుగులు పడబోతున్నాయి. దీని నిమిత్తం అల్లూరు సీతారామరాజు జిల్లాలో రెండు రోజులపాటు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించనున్నారు. 7వ తేదీ ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామానికి చేరుకుంటారు. పెదపాడు గ్రామంలోని గిరిజన ఆవాసాలను సందర్శించడంతోపాటు అడవి తల్లి బాట పేరిట చేపట్టే రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. 8వ తేదీ ఉదయం అరకు మండలం, సుంకరమిట్ట చేరుకుని అక్కడ నిర్మించిన ఉడెన్ బ్రిడ్జికి ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడి నుంచి విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు చేరుకుంటారు. అక్కడ ఎకో టూరిజంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో పర్యటక అభివృద్ధి, ఎకో టూరిజంకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధి, రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రోత్సాహంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
