ఈ ఏడాది చివర్లో ఎన్నికలు.. బడ్జెట్లో బిహార్పై వరాల జల్లు
(NEW DELHI, FEBRUARY 1st, 2025 pvginox.com )

కేంద్రంలో ఎన్డీయే కూటమిలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పూర్తిస్థాయి తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా బిహార్ పై వరాల జల్లు కురిపించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న ఆ రాష్ట్రానికి వార్షిక పద్దులో ప్రత్యేక స్థానం దక్కింది. బిహార్లో మఖానా బోర్డు ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి తెలిపారు. మఖానా వ్యాపారం కోసం రైతుల సౌకర్యార్థం ఈ బోర్డు పని చేయనుంది. ‘‘బిహార్లో ఏర్పాటుచేయనున్న మఖానా బోర్డు ద్వారా వాటి ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయి. దీనికింద రైతులకు శిక్షణ అందుతుంది. వారు అన్ని ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందేలా బోర్డ్ చూస్తుంది’’ అని మంత్రి వెల్లడించారు. బిహార్లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్కు ఆర్థికసాయం అందిస్తాం.
ఐఐటీ పట్నా సామర్థ్యాన్ని మరింత పెంచుతాం.
పదేళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆ దిశగా బిహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. బిహార్లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీనిద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాలకు మరింత మద్దతు అందనుంది.
బిహార్లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నీతీశ్కుమార్ పార్టీ జేడీయూతో కలిసి భాజపా అధికారంలో ఉంది. ఆ జేడీయూ కేంద్రంలోని ఎన్డీయేలో కీలక భాగస్వామి. బిహార్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పిన కేంద్రం.. ఎన్నికల ముందు ఇలా వరాల జల్లు కురిపించింది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా రహదారుల అభివృద్ధి, గంగానది రెండు లైన్ల వంతెన నిర్మాణం, విద్యుదుత్పత్తి కేంద్రం వంటి పలు ఆర్థిక వరాలు ఇచ్చింది.