Uncategorized

పంచాయతీ లకు మహర్దశ

Spread the love

(అమరావతి, 20/1/2025 pvginoxtelugunews )

గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు
• ఆదాయ ప్రాతిపదికతతోపాటు జనాభా ప్రాతిపదికనను జోడించి కొత్త గ్రేడ్లు
• గ్రేడ్లు ఆధారంగా సిబ్బంది కేటాయింపు… గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందితో సమన్వయం
• అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు కమిటీ ఏర్పాటు
• ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి సమీక్షలో నిర్ణయం

గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని, దీనికోసం సిబ్బంది లేమి సమస్యను అధిగమించాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ అధికారులకు స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి, కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. గతంలో పంచాయతీల ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని మాత్రమే చేపట్టిన క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానానికి, నూతనంగా జనాభాను కూడా ప్రాతిపదికగా తీసుకొని పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లు విభజించాలని సూచించారు. సిబ్బంది నియామకం విషయంలో హెచ్చుతగ్గులు లేకుండా, గ్రామ పంచాయతీల్లో సేవలు నిరంతరాయంగా ప్రజలకు ఆండాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన క్యాంపు కార్యాలయంలో గ్రామ పంచాయతీల క్లస్టర్ గ్రేడ్ల విభజనపై సమీక్ష చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆదాయం ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా తక్కువగా ఉండి, ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభాగా ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో పాత క్లస్టర్ వ్యవస్థ వల్ల సిబ్బంది నియామకం విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులు ఈ సమీక్షలో ప్రస్తావనకు వచ్చాయి. గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకొని కొత్త క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానంలో సిబ్బందిని నియమించుకోవడంపై చర్చించారు.. ఈ విధంగా చేయడం వల్ల మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాలు అమలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణతో పాటు గ్రామ పంచాయతీల ప్రాథమిక బాధ్యత అయిన తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య మెరుగుదలకు తగినంత మంది సిబ్బంది ఉంటారని, వీటిపై అధ్యయనం చేసి పంచాయతీల్లో పరిపాలన సులభతరం చేసేందుకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కమిటీ వేయాలని ఉపముఖ్యమంత్రివర్యులు నిర్ణయించారు. కొత్త క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి నలుగురు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటవుతుంది.. జిల్లా యూనిట్ ప్రాతిపదికన 26 జిల్లాల్లో ఉన్న పంచాయతీల ఆదాయం, జనాభాను ప్రాతిపదికగా తీసుకొని జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికలను రాష్ట్ర కమిటీ పరిశీలించిన తర్వాత పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లను ప్రభుత్వానికి నివేదిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *