
నిమ్మరాజు దంపతులను సత్కరిస్తున్న బ్రహ్మశ్రీ డా.గౌరీ శంకర్ గురూజీ
సమాజ శ్రేయస్సు కోసం పాత్రికేయులు పాటుబడాలి
– ఆధ్యాత్మికవేత్త గౌరీ శంకర్ గురూజీ
(గుంటూరు, సెప్టెంబర్ 9: pvginox.com)
ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన, నైతిక విలువలను పెంచి, తద్వారా సమాజ శ్రేయస్సు కోసం పాత్రికేయులు పాటుబడాల్సిన అవసరం ఎంతైనా వుందని శ్రీ మహా విద్య ఉపాసకులు, బ్రహ్మశ్రీ డాక్టర్ పి.వి.గౌరీ శంకర్ గురూజీ పిలుపిచ్చారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన గురు పూజా మహోత్సవాలను పురస్కరించుకుని గురూజీ గోరంట్ల శివా గ్రీన్ వ్యాలీలో సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు దంపతులను శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించి, ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా గురూజీ మాట్లాడుతూ.. నిమ్మరాజు గడచిన 45 ఏళ్లుగా జర్నలిజం వృత్తిని నమ్ముకుని అటు సమాజ శ్రేయస్సుకు, ఇటు యూనియన్ నేతగా సహచర జర్నలిస్టు మిత్రుల సంక్షేమానికి తనవంతుగా పాటుపడుతున్నారని ప్రశంసించారు. అదే బాటలో అందరూ తమవంతు కృషి చేయాల్సిన అవసరముందన్నారు. నిమ్మరాజు స్పందిస్తూ.. గౌరీ శంకర్ గురూజీ కుటుంబంతో తనకు నాలుగు దశాబ్దాల సాన్నిహిత్యం వుందని సంతోషం వ్యక్తపరిచారు. రెండు దశాబ్దాల పాటు ఆయన ఆంధ్రభూమి దినపత్రికలో కల్చరల్ రిపోర్టర్ గా చక్కగా పనిచేశారని గుర్తుచేస్తూ, విద్యార్థి దశ నుంచే ఆయనలో ఆధ్యాత్మిక చింతన మెండుగా వుండేదని తెలిపారు.
